ఏడాది తర్వాత మళ్లీ కలవనున్న మోదీ, ట్రంప్.. విభేదాలు సమసిపోతాయా?

  • ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా ప్రధాని మోదీకి ఆహ్వానం
  • ఏడాది తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం
  • గతేడాది భారత్-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్‌పై ఇరు నేతల మధ్య పెరిగిన దూరం
  • నోబెల్ శాంతి బహుమతి కోసమే ట్రంప్ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో విమర్శలు
  • ఈ భేటీతోనైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయో లేదోనని ఆసక్తి
ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించే అతికొద్ది సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ ఒకటి. గతేడాది వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాల తర్వాత ఇప్పుడు మళ్లీ వారిద్దరూ ముఖాముఖి కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్‌లో వచ్చే నెలలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సు ఈ కలయికకు వేదిక కానుంది. ఈ భేటీతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గుతాయో లేదోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జూన్ 15 నుంచి 17 వరకు ఎవియన్-లెస్-బెయిన్స్‌లో జరిగే ఈ సదస్సులో జీ7 సభ్య దేశాలు కాకపోయినా, ప్రత్యేక ఆహ్వానిత దేశంగా భారత్ పాలుపంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్‌ల మధ్య అధికారికంగా కాకపోయినా, కనీసం అనధికారికంగానైనా ఒక చిన్న సమావేశం (పుల్-అసైడ్ మీటింగ్) జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అనూహ్య శైలిని బట్టి చూస్తే, ఈ భేటీని కొట్టిపారేయలేం.

గతేడాది ఏం జరిగింది?
మోదీ, ట్రంప్ చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన్ను కలిసిన తొలి ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. ఆ సమయంలో మోదీని తన "గొప్ప స్నేహితుడు" అని అభివర్ణించిన ట్రంప్, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది నెలలకే మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు సంబంధాలు బెడిసికొట్టాయి.

ఆ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో తానే కీలక పాత్ర పోషించానని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతిని ఆశించి, తాను వాణిజ్యపరమైన బెదిరింపులతోనే అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని ప్రతిచోటా ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు పాకిస్థాన్ వంత పాడగా, భారత్ మాత్రం తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఇస్లామాబాద్‌తో నేరుగా జరిపిన చర్చల ఫలితమేనని, ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత జరగబోయే ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

PM Modi
Narendra Modi
Donald Trump
G7 Summit
India US relations
Trade tensions
France
Emmanuel Macron
India Pakistan relations
Ceasefire agreement
White House

More Telugu News